Krishna-District-Lorry-Owners-Foundation
29-January-2019
తెలుగు భాషను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు “స్కాలర్ షిప్పుల పంపిణీ కార్యక్రమము” మరియు “తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషిచేసిన వారికి గౌరవ సత్కారము”
[wpvideo 61uG8wZA]
[wpvideo sehFEPsC]
మాతృభాషను విస్మరించొద్దు
కరెన్సీనగర్ (విజయవాడ), న్యూస్టుడే: భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేసే వారంతా చరిత్రలో నిలిచిపోతారని కేంద్రీయ హిందీ సమితి సభ్యులు, మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న వారికి సత్కారం, విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన యార్లగడ్డ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలని, సాంకేతిక పరిజ్ఞానమంటూ పరుగులు పెట్టినా మూలాలు విస్మరించకూడదని చెప్పారు. ఆంగ్లం, ఇతర భాషలు నేర్చుకోవాలే తప్ప వాటిపై మోహం ఉండకూడదన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం లభిస్తుంటే… రాష్ట్రంలో మాత్రం ఉనికిని కోల్పోయే పరిస్థితులు రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను అభ్యసిస్తున్న విద్యార్థులకు చేయూతనిచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫౌండేషన్ సభ్యులను ఆయన అభినందించారు. సీనియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు మాట్లాడారు. తొలుత తెలుగు భాష పురస్కార గ్రహీత నాగుళ్ల గురుప్రసాదరావు, ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకులు డాక్టర్ గుమ్మా సాంబశివరావులను సన్మానించారు. వీరితో పాటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుభాష అభివృద్ధికి కృషి చేస్తున్న 17 మంది ఉపాధ్యాయులను, నగరపరిధిలోని పలు కళాశాలల్లో తెలుగు అభ్యసిస్తున్న 22 మంది విద్యార్థులకు ఉపకారవేతనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ సంఘం అధ్యక్షులు కోనేరు వెంకట రామారావు, వై.వి.ఈశ్వరరావు, ఎర్నేని రాజారావు, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.